ప్రతి జట్టు ఇండియాను ఓడించాలనుకుంటోంది: కోహ్లి

 టీమిండియాను ఓడించాలని అన్ని టెస్టు జట్లు తహతహలాడుతున్నాయని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. బుధవారం జట్టు యాజమాన్యం, కెప్టెన్‌ కోహ్లితో పాటు ఆటగాళ్లు వెల్లింగ్టన్‌లోని భారత హై కమిషన్‌ను వారి కోరిక మేరకు సందర్శించారు. ఈ సందర్భంగా కోహ్లి మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. ప్రతి జట్టు ఇండియాను ఓడించడానికి ప్రయత్నిస్తుందని, అందుకు కివీస్‌ మినహాయింపు కాదని కోహ్లి నవ్వుతూ అన్నారు. వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌లో ఇండియా 360 పాయింట్లతో టాప్‌ పొజిషన్‌లో కొనసాగుతోంది. కేవలం 7 మ్యాచ్‌లాడిన ఇండియా అన్నింటా గెలిచి, చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో ఉంది. 296 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఆసీస్‌ 10 మ్యాచ్‌లాడి ఏడింట గెలవగా, 2 మ్యాచ్‌ల్లో ఓడి.. ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. కివీస్‌ కేవలం 60 పాయింట్లతో ఆరోస్థానంలో ఉంది.